Cantonment By Election | సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ అభ్యర్థులకు సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు. సికింద్రాబాద్ బరిలో 45 మంది అభ్యర్థులు, కంటోన్మెంట్లో 23 నామినేషన్లు వేస్తే ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, ఐదుగురు విత్ డ్రా చేసుకోగా బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతో పాటు జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్రులు బరిలో నిలిచారు.
మేడ్చల్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి లోక్ సభ బరిలో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లు దాఖలు చేయగా… నామినేషన్ల పరిశీలన అనంతరం 77 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించగా 37 నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా సోమవారం 15 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించామని తెలిపారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): చేవెళ్ల లోక్సభ నుంచి 43 మంది బరిలో నిలిచారు. మొత్తం 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 26న స్క్రూట్నీ ప్రక్రియ పూర్తయ్యాక 18 మంది నామినేషన్లను తిరస్కరించడంతో బరిలో 46 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 23 మంది వివిధ జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల నుంచి నామినేషన్లను దాఖలు చేయగా..మరో 23 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల ఉప సంహరణ సందర్భంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉప సంహరించుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక రాజేంద్రనగర్లోని ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు.