తాడ్వాయి/గోవిందరావుపేట, డిసెంబర్25: అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో పనిచేసి వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతరను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.
మహాజాతరకు సంబంధించి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆమె పరిశీలించారు. అలాగే గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలోని గుండ్లవాగు బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతరను పురస్కరించుకొని బ్రిడ్జి వద్ద భక్తుల వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గౌస్ ఆలం ఉన్నారు.