Rythu Runa Mafi | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు మాట తప్పిన రేవంత్రెడ్డి మరోసారి మాట తప్పరనే గ్యారెంటీ ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించారని, దీనిని నమ్మలేమని రైతులు చెప్తున్నారు. రైతుబంధు అంశంలోనూ ఇదేవిధంగా చేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడం కష్టమేనని ఆర్థిక, బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదని చెబుతున్నారు. జూన్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్నందున అప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. మిగిలిన రెండు నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బ్యాంకుల నుంచి లెక్కలు తెప్పించడం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్కు బదిలీ చేయించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలను రూపొందించలేదు. కటాఫ్ తేదీని నిర్ణయించలేదు. మార్గదర్శకాలు రూపొ ందించలేదు. బ్యాంకర్లు రైతు రుణాల వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 4 నెలల సమయం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చెప్పినట్టుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ ఏవిధంగా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రుణమాఫీ ఏ విధంగా చేస్తారనే దానిపై ఒక సందర్భంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న రైతుల మొత్తం రుణాలను ఆ కార్పొరేషన్కు బదిలీ చేయించుకొని, ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాల మాదిరిగా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారా రుణమాఫీ అంత సులువుకాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్గదర్శకాలు రూపొందించి, కటాఫ్ తేదీని నిర్ణయించిన తరువాతనే రైతుల రుణాలు మొత్తం ఎంత ఉన్నాయనే లెక్క తేలుతుంది. గతంలో కేసీఆర్ సర్కారు తొలిసారి రుణమాఫీ చేసినప్పుడు 2014 మార్చి 30 వరకు ఉన్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికి 23 లక్షల మందికి సంబంధించిన రూ.13 వేల కోట్లను మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీపై కటాఫ్ తేదీని నిర్ణయించకపోవడంతో అసలు మాఫీ చేయాల్సిన రుణం ఎంత? ఏ రైతులకు మాఫీ అవుతుంది? ఎవరికి కాదు? అనే అంశంపై స్పష్టత కొరవడింది.
మాఫీ చేయాల్సిన రైతుల రుణం రూ. 32 వేల కోట్ల వరకు ఉంటుందని ఒక సందర్భంలో రేవంత్రెడ్డి పేర్కొనగా, ఈ మొత్తం రూ.40 వేల కోట్ల వరకు ఉంటుందని వ్యవసాయశాఖవర్గాలు అంచనా వేస్తున్నాయి. కటాఫ్ తేదీ నిర్ణయించి, బ్యాంకుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత కటాఫ్ తేదీ నిర్ణయిస్తే ఏ రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది? అనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపాయి.
సాధారణంగా వివిధ పథకాలకు ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి, ఆ ప్రకారం అమలు చేస్తాయి. రుణమాఫీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ చేయాలని భావిస్తే, బడ్జెట్తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బ్యాంకుల రుణాలను కార్పొరేషన్కు బదలాయిస్తే ప్రతి నెలా కచ్చితంగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్తో సంబంధం లేకుండా నిధులు సమకూరే ఇతర మార్గాల ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితేనే బ్యాంకులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటాయని భావిస్తున్నారు.
కేసీఆర్ చేసిన రుణమాఫీ పొందినవారు వెంటనే బ్యాంకుకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9న మొత్తం రుణాలను మాఫీ చేస్తా. అందుకే రుణాలు తెచ్చుకోవాలని రైతులను కోరుతున్నా.
-అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీపై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
రుణమాఫీ సాధ్యమవుతుంది. ఇందుకు రూ.30-32 వేల కోట్లు అవసరం. 50 నెలలకు ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటాం. ఒక నెలలో రుణమాఫీ పూర్తిచేస్తాం.
– జనవరి 6న ఒక న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్రెడ్డి
నారాయణపేట గడ్డపై నుంచి 69 లక్షల మంది తెలంగాణ రైతులకు మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా.
– ఏప్రిల్ 15న ఎన్నికల సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటన