Pineapple benefits | అనాస లేదా పైనాపిల్.. తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో విటమిన్ ఏ, సీ, బీ6 తోపాటు కాల్షియం, ఐరన్, సోడియం, మాంగనీస్, పొటాషియం, రైబోఫ్లావిన్ వంటి మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని కోసుకుని తింటారు. రసం తీసి పానీయంగా కూడా తీసుకుంటారు.
జీర్ణక్రియలో పైనాపిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాధులపై పోరాడే యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. వాంతులు, వికారం కలిగినప్పుడు ఉపశమనం ఇస్తుంది. జుట్టు రాలడం తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. అయితే, పైనాపిల్ను చాలా మంది మామూలుగా తినేస్తుంటారు. అలాకాకుండా తినే ముందు ఉప్పు నీటిలో నానబెట్టడం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
పైనాపిల్ను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవడానికి అనేక కారణాలను న్యూయార్క్కు చెందిన లైసెన్స్డ్ ఆక్యుపంక్చర్ నిపుణురాలు డాక్టర్ లిల్లీ చోయ్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పైనాపిల్ పండు కడుపు, మూత్రపిండాల వ్యవస్థలకు సహాయపడుతుంది. శరీరానికి శక్తినివ్వడమే కాకుండా దాహం కూడా తీరుస్తుంది.
పైనాపిల్ తిన్నప్పుడు నోట్లో ఒక రకమైన జలదరింపు అనుభూతిని పొందుతారు. ఇది పైనాపిల్ కండలో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ నుంచి వస్తుంది. నోట్లో పెట్టగానే ప్రోటీన్లను ఇది విచ్చిన్నం చేస్తుంది. ఫలితంగా నోరు, నాలుక, గొంతులో ఒక రకమైన చికాకు భావన కలుగుతుంది. ఈ కారణంగానే చాలా మంది పైనాపిల్ను తినేందుకు ఇష్టపడరు.
బ్రోమెలైన్ అనేది ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. వాపులను తగ్గించడంలో గ్రేట్గా ఉపయోగపడుతుంది. సైనసైటిస్, కండరాల్లో పుండ్లు పడటం, ఆస్టియో ఆర్థరైటిస్, జీర్ణక్రియ సమస్యలు, గాయలు, బరువు తగ్గడం వంటివి చికిత్సకు పైనాపిల్ను మందుగా ఉపయోగిస్తారు. రక్త కణాలను రిపేర్ కూడా చేస్తుంది. రక్తపోటును స్థిరీకరిస్తుంది కూడా.
పైనాపిల్ను తినడానికి ఒక నిమిషం ముందు దానిని ఉప్పు నీటిలో నానబెట్టడం చాలా మంచిది. ఉప్పు బ్రోమెలైన్ ఎంజైమ్ను యాక్టీవ్గా లేకుండా చేస్తుంది. అలాగే ఉప్పును కలుపడం వల్ల పైనాపిల్ పండు తీపిని, రుచిని మరింత జోడించే అవకాశాలు ఉంటాయి. పైనాపిల్ను ముక్కలుగా కోసి ఒక బౌల్లో వేసి దానిపై కొంత ఉప్పు చల్లాలి. నిమిషం పాటు నానబెట్టిన తర్వాత ఆరగించాలి. లేదంటే 60 డిగ్రీల సెంటీగ్రెడ్ వరకు ఉడకబెట్టి తినడం చాలా ప్రయోజనకరం. ఇలా ఉప్పులో నానబెట్టి తినడం వల్ల అలెర్జీలు, డయోరియా, వికారం, వాంతి, అధిక మొత్తంలో రుతు రక్తస్రావం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. గర్భాశయ కండరాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున గర్భిణీలు పైనాపిల్ తినకుండా చూసుకోవడం శ్రేయస్కరం అని సెలవిస్తున్నారు డాక్టర్ లిల్లీ చోయ్.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.