న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తంచేశారు. ‘అన్ని అంశాలపై మేమే ఆదేశాలు జారీచేయాలంటే ఇక ప్రజాప్రతినిధులను ఎన్నుకొన్నది దేనికి’ అని అడ్వొకేట్, పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ను ప్రశ్నించారు. అక్రమ వలసదారులను ఏడాదిలోగా గుర్తించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ‘ఉపాధ్యాయ్ గారూ.. నేను ప్రతీ రోజు మీ పిటిషన్లపైనే విచారణ జరుపాల్సి వస్తున్నది. ఎంపీల సమస్యలు, అభ్యర్థుల నామినేషన్లు, ఎన్నికల సంస్కరణలు ఇలా అన్నింటిపై మీరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ రాజకీయ సమస్యలు. ప్రభుత్వాన్ని కోరాల్సిన వాటిని కోర్టు ముందుకు తెచ్చారు’ అని సీజేఐ రమణ అన్నారు. ఇలాగైతే బిల్లులను కూడా కోర్టులే పాస్ చేయాలేమో అని వ్యాఖ్యానించారు.