న్యూఢిల్లీ : కరోనా తర్వాత మంకీపాక్స్ మరో ప్రపంచ మహమ్మారిగా మారింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. వైరస్కు సంబంధించి గణాంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. గడిచిన 24 రోజుల్లో 27 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించగా.. ఇప్పటి వరకు 780 మందికి ఈ వైరస్ సోకిందని పేర్కొంది. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ వైరస్ కారణంగా మరణాలు నమోదవుతున్నాయి. కాంగోలో ఈ ఏడాది మంకీపాక్స్తో మరణించగా.. నైజీరియాలో తొలి మరణం నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మే 31న మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, భారత్లో మంకీపాక్స్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా మంకీపాక్స్కు సంబంధించి సూచనలు చేసింది. అనుమానితుల శాంపిళ్లను పూణేలోని ఎన్ఐవీ లాబొరేటరీకి పంపాలని చెప్పింది. ఒకవేళ పాజిటివ్ కేసు నమోదైతే కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయాలని చెప్పింది. బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో గుర్తించి వారిని ఐసొలేట్ చేయాలని సూచించింది. మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే వైరస్ తీవ్రత పెరుగుతుందని చెప్పింది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంకీపాక్స్.. వైరస్ వల్ల సాకుతుంది. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ సమూహానికి చెందింది. అయితే, ఈ వైరస్ తొలిసారిగా కోతుల్లో గుర్తించగా.. దీనికి మంకీపాక్స్గా పిలుస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకిన సందర్భాలు చాలా తక్కువ. తుమ్ములు, దగ్గిన సమయంలో తుంపర్ల ద్వారా, చర్మంపై ఏర్పడిన పుండ్లు, వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో వైరస్ సోకే అవకాశం ఉంటుందని వివరించింది. అయితే, మశూచి నిర్మూలన కార్యక్రమంలో ఉపయోగించిన టీకాలు కొంతమేర సత్ఫలితాలిచ్చాయి. కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తుండగా.. వాటిలో ఒకటి వ్యాధి నివారణకు ఆమోదించింది. మశూచి చికిత్స కోసం అభివృద్ధి చేయబడిన ఓ యాంటీ వైరల్ ఏజెంట్ మంకీపాక్స్ చికిత్స కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ లైసెన్స్ పొందింది.