ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన్నా లేదు. అయితే ఈ ఉపఎన్నిక ఒక అతి ముఖ్యమైన అంశాన్ని తెర పైకి తెచ్చింది. తమ ఉనికే ప్రమాదంలో పడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైపోతాయి అనేదే ఆ అంశం.
ఈ విషయాన్ని చరిత్ర కూడా స్పష్టం చేస్తుంది. దీనికి అనేక సాక్ష్యాలు మనకు కనపడుతాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 1952లో జరిగిన సాధారణ ఎన్నికలు ఒక ఉదాహరణ. దళితులు, బీసీల జీవన స్థితిగతులు మారబోతున్నాయని వారికి అన్పించినా.. మార్చేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు లేదా ప్రభుత్వం ఉందని వారు గుర్తించినా.. వెంటనే అలర్ట్ అవుతారని ఆ ఎన్నిక రుజువు చేసింది. నిన్న హుజూరాబాద్లో కూడా అదే జరిగింది.
మంచి చేద్దామనే ఆలోచన కూడా కొన్నిసార్లు ఓటమికి గురి కావాల్సి వస్తుంది. నాడు అంబేద్కర్ కూడా కాంగ్రెస్, జనసంఘ్లకు తాను దూరంగా ఉంటానని చెప్పారు. దళితులు, బీసీలు ఆత్మగౌరవంగా జీవించేందుకు తాను బాటలు వేస్తుంటే వీరు దాన్ని పాడుచేస్తారని ఆయనకు తెలుసు. అందుకే తాను స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ వీరెవరి అండతో ఎదగదని చెప్పారు.
1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ‘షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్’ పార్టీ తరఫున నార్త్ ముంబై లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్పార్టీ కాజ్రోల్కర్ను బరిలోకి దింపింది. అంబేద్కర్ అప్పటికే ప్రపంచ స్థాయి మేధావిగా గుర్తింపు పొందారు. భారత రాజ్యాంగాన్ని రాశారు. యావత్దేశం ఆయనకున్న చిత్తశుద్ధిని గుర్తించింది. ఆయనపైన కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడాన్ని నాటి సమాజం వ్యతిరేకించింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవటం మాట అటుంచి.. అన్ని శక్తియుక్తులు ఉపయోగించి అంబేద్కర్ను ఆ ఎన్నికల్లో ఓడించింది. కాంగ్రెస్పార్టీ నుంచి బయటకొచ్చి భారతీయ జనసంఘ్ పార్టీ (ప్రస్తుత బీజేపీ పూర్వరూపం)ని స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఆ ఎన్నికల్లో అంబేద్కర్కు మద్దతునీయలేదు.
మరి అంత పెద్ద మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్పై పోటీకి దిగడం సరికాదని ఈ రెండూ పార్టీలు ఎందుకు భావించలేదు? దీనికి సమాధానం చాలా సులభంగానే దొరుకుతుంది. నాడున్న భారతీయ కుల పీడన వ్యవస్థపై, అసమాన అవకాశాలపై అంబేద్కర్ తిరుగులేని పోరాటం చేశారు. దళితులు, బీసీలు, స్త్రీలు అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపర్చారు. దాని కోసం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా అంబేద్కర్ అడుగు ముందుకు వేశారు తప్ప వెనక్కి వేయలేదు. దీన్ని గుర్తించిన ఈ రెండు పార్టీలు తమ పెత్తనాన్ని అంబేద్కర్ కూలదోస్తారని భావించాయి. చట్టసభల బయటఉండే దళితులు, బీసీలకు ఈయన పెద్దఎత్తున మద్దతిస్తే, ఇక ఆ వర్గాలు చట్టసభల్లోకి వస్తే తమ ఆధిపత్యానికి ప్రమాదం అని ఈ రెండుపార్టీలు భావించాయి. అందువల్ల అంతర్గతంగా ఒక్కటై ఆయనను ఓడించాయి. ఇలాంటిదే తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రతిఫలించింది.
దళితులకు, బీసీలకు స్వయంనిర్ణయాధికారం వస్తే తమ చెప్పు చేతుల్లో ఉండరని భావించిన నాటి కాంగ్రెస్, జనసంఘ్ లాగానే హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి. దళితబంధు స్కీం తర్వాత బీసీబంధు స్కీం తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీన్ని చూసి ఈ రెండుపార్టీలు నాడు అంబేద్కర్ను అడ్డుకున్నట్లుగానే ఇప్పుడు టీఆర్ఎస్ను అడ్డుకోవాలని భావించాయి. అందుకే చిలువలు పలువలు చేసి ఉన్నది లేనిది ప్రచారం చేశాయి. ఎస్సీ, బీసీల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చే నాయకుడైనా, ప్రభుత్వ పాలసీ అయినా ముందుకు వస్తే, ఈ రెండుపార్టీలు అడ్డుకుని తీరుతాయి. ఎస్సీ, బీసీలు తమ కింద పడి ఉండాల్సిందేననే తమ ఫ్యూడల్ స్వభావాన్ని పదేపదే చాటుకుంటాయి. ఇదంతా అంతర్గతంగా జరిగిపోతూ ఉంటుంది. అప్పట్లో నెహ్రూ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ బయటకు మాత్రం విమర్శించుకునేవారు. కానీ అంతర్గతంగా ఒక్కటై అంబేద్కర్ను ఓడించారు.
హుజూరాబాద్లో పోటీ టీఆరెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఉప ఎన్నికకు రెండు మూడు నెలల ముందే అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాన్ని తమ పార్టీ అంత సీరియస్గా చేయటం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. తమ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయని స్వయంగా కాంగ్రెస్ కీలకనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దాని అర్థం.. తమ వారే బీజేపీకి ఓట్లు వేయించారు అని. ఇక అక్కడ ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని కూడా ఆ పార్టీ అంత సీరియస్గా తీసుకోలేదు. చాలా పేర్లు తెర పైకి వచ్చిన తర్వాత చివరకు ఓ పేరు ఖరారు చేశారు. అప్పటికే అక్కడ ఉపఎన్నిక ప్రచారం జోరందుకున్నది. ఇదంతా ఎందుకు చేసినట్లు అంటే చాలా సులభంగానే అర్థమవుతున్నది. నాడు అంబేద్కర్కు కాంగ్రెస్, జనసంఘ్ ఎలా ద్రోహం చేశాయో.. అదే విధంగా హుజూరాబాద్లో దళిత, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేందుకు, వారికి ఆర్థిక పరిపుష్టి లేకుండా చేసేందుకు అంతర్గతంగా కుమ్మకైనట్లు చాలా స్పష్టంగానే అర్థం అవుతున్నది.
బీజేపీ నాయకుల విమర్శలు అన్నీ కూడా టీఆర్ఎస్ పైనే ఉన్నవి తప్ప కాంగ్రెస్పార్టీని పల్లెత్తుమాట అనటం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ఉన్నట్టు కనిపించినా వారి మధ్యన మంచి ‘అవగాహన’, ‘బంధం’ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ధోరణి బీజేపీకి లాభపడే విధంగా ఉందని మమత బెనర్జీ ఇటీవల చెప్పిన మాటలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నది. అయితే, ఇలాంటి కుటిల రాజకీయాలు, కుట్రల ఏకీకరణలు కొన్నిసార్లు మాత్రమే విజయం సాధిస్తాయి. నాడు అంబేద్కర్ విజయాన్ని కాంగ్రెస్, జన్సంఘ్ అడ్డుకున్నా ఆ తర్వా త యావత్ ప్రపంచం కొనియాడదగిన నాయకుడయ్యాడు బాబాసాహెబ్. నేడు దళితబంధులాంటి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు, బీసీలకు అండగా నిలిచేందుకు నడుంకట్టిన పార్టీని, దాని నాయకున్ని ఓడించాలని ఏకమయ్యాయి. కానీ, చరిత్ర పునరావృతమవుతుంది. అంబేద్కర్ను కీర్తించినట్లుగానే.. రాబోయేరోజుల్లో కేసీఆర్ను వేనోళ్ల పొగడక తప్పదు.
ఏడేండ్ల తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ఆత్మతో చూడాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం అర్థమవుతుంది. 70 ఏండ్ల పరాయి పాలనను మరిచి ఏడేండ్ల పాలననే ప్రాతిపదికగా తీసుకొని దూషిస్తూ మాట్లాడే వ్యక్తులు స్వార్థపరులే అవుతారు తప్పించి నిఖార్సయిన తెలంగాణవాదులు కాలేరు.
(వ్యాసకర్త: ఆందోల్ శాసనసభ్యులు)
–క్రాంతి కిరణ్