న్యూఢిల్లీ: సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ నగరం స్తంభించింది. దీంతో ఈ ప్రాంతంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల పట్ల మరింత ఆందోళన పెరిగింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుబాయ్కి వెళ్లవలసిన 79 విమానాలను రద్దు చేశారు.
ఏడాదిన్నర కాలంలో కురిసే వర్షం మంగళవారం ఒక గంటలోనే కురవడంతో దుబాయ్ నగరం, యూఏఈలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణం కొంత వరకు క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) అని నిపుణులు చెప్తున్నారు. యూఏఈలో ఏటా 200 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది, వేసవి కాలంలో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఇక్కడ తరచూ ఉపయోగిస్తారు. మంగళవారం కురిసిన వర్షాన్ని గమనించిన నిపుణులు ప్రకృతిలో సహజత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.