Tragedy | కర్ణాటకలోని మైసూరులో తీవ్ర విషాదం నెలకొంది. అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్పై నుంచి కిందపడటంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లయిన 15 రోజుల్లోనే ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. మైసూరు తాలుకా మోగనహుండి గ్రామానికి చెందిన మేఘనకు నంజనగూడు తాలుకా బిదరగోడుకు చెందిన పునీత్తో 15 రోజుల కిందటే వివాహమైంది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ ప్రకారం మేఘన తన పుట్టింటికి వెళ్లింది. భార్యను కలిసేందుకు పునీత్ కూడా శుక్రవారం సాయంత్రం మోగనహుండికి వెళ్లాడు. అక్కడ భోజనం అనంతరం భార్యతో కలిసి బైక్పై ఇంటికి బయల్దేరారు.
రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆర్టీ నగర్ సమీపంలో వారికి అడవి పంది ఎదురు రావడంతో దాన్ని తప్పించబోయి, బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్లో కువెంపునగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, తలకు తీవ్ర గాయాలైన మేఘన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. పునీత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో పునీత్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడని.. వెనుక కూర్చున్న మేఘన కూడా హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదేమోనని అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.