హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ల గ్రామంలో మంగళవారం శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీశ్ తో కలసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పొట్లపల్లి శ్రీ స్వయం భూ రాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని, ఆకలి అయిన వారికి అన్నం పెట్టి మంచి పేరు గడించారన్నారు.
పది మందికి ఉపయోగకరమైన సేవ చేస్తున్న స్వయంభూ రాజేశ్వర ట్రస్టు వాసవీ నిత్యాన్నదాన సత్రానికి శాశ్వత నిధిలో భాగస్వామిగా తన నెల వేతనాన్ని ట్రస్టుకు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హుస్నాబాద్లో రూ.10 కోట్లతో 50 పడకల మాతా, శిశు సంక్షేమ దవాఖానను ఏర్పాటు చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లర్లపై రైడింగ్ పేరిట వేధింపులకు గురి చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోళ్లు పూర్తి చేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఒకవైపు, రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరం గా ఉందన్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా త్వరలో అప్ గ్రేడ్ చేస్తామన్నారు.