హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. కేంద్రం విధానాలను తూర్పారబట్టారు. కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారని, అన్ ఎంప్లాయిమెంట్ పెరిగిందని, కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారని, జీడీపీ తగ్గిందని, పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దేశం ఆత్మ నిబ్బరం కోలోతున్నదన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘దేశంలో ఎదైనా పెరిగిందన్న ఉందంటే.. మత పిచ్చి పెంచుతున్నరు. మత పిచ్చి.. ఆ కార్చిర్చు ఈ దేశాన్ని దహించి వేస్తది. నేను దేశ యువత, దేశంలోని బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తున్నాను.. ఇది మంచిది కాదు.
దేశంలో నెలకొల్పబడిన వాతావరణం.. దశాబ్దాల పాటు కొనసాగిన కృషి కుప్పకూలుతది. యువత ఉద్యోగ అవకాశాలు పోతయ్. చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. దేశంలో ఇప్పుడే జరుగుతుంది. 20వేలకుపైగా పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయారు భారతీయ పిల్లలు. వీళ్లంతా మెడిసన్ చదువుకునేందు ఉక్రెయిన్ వెళ్లారు. మన రాష్ట్రం నుంచి 740 మంది పిల్లలు వెళ్లారు. వారిని రాష్ట్రానికి తప్పించేందుకు ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడాం. ఇందులో 700పైచీలుకు పిల్లలు ఎంబీబీఎస్ చదువుకునేందుకు వెళ్లారు. అక్కడ రూ.25లక్షల్లో అయితే.. ఇక్కడ రూ.కోటి అడుగుతున్నరు. పేద పిల్లలు భరించలేనోళ్లు అక్కడన్న చదువుకుందామని వెళ్లారు. ఇందుకు పోయారంటే? ఇక్కడ దిక్కులేక పోయారు.
అవకాశం లేక పోయారు.. ఏం చేయాలి. ఉక్రెయిన్లో యుద్ధం ఇంకా సమసిపోలేదు.. ఏమైతదో తెలియదు. కిందపడి మీదపడి 700 మంది పిల్లలను టికెట్లు భరించి వాపస్ తీసుకువచ్చాం. ఇప్పుడు వాళ్ల భవిష్యత్ ఏంటీ? డిస్ కంటిన్యూ కావాలా? తిరిగి ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? ఏం జరగాలి? తెలంగాణ ప్రభుత్వంగా ప్రకటిస్తున్నా. వెంటనే భారత ప్రభుత్వానికి రాస్తాం వెంటనే. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా మేం భరించి ఇక్కడ చదివిపిస్తాం. విద్యార్థులు డిస్కంటిన్యూ కాకుండా.. భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తాం. ఈ సందర్భంగా వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ను ఆదేశించారు. దీనిపై కూడా కొందరు కేంద్రమంత్రులు ఎవరు పొమ్మన్నరు? అంటున్నారని.. బెంగళూర్కు చెందిన నవీన్ అనే వ్యక్తి మృతి చెంది.. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే.. తిన్నది అరక్క పోయారు అని మాట్లాడుతున్నరు.
వాళ్లపై మాట్లాడాల్సిన పద్ధతేనా? దీనిపై మాట్లాడితే మీరు దేశ ద్రోహులు.. ఇదెక్కడి అన్యాలం. ఇటువంటి పెడధోరణులు ఎందుకు దారితీస్తాయ్?.. ఇది ఏ రకంగా వాంఛనీయం కాదు. ఇది ఇలాగే కొనసాగిస్తే దేశానికి ప్రమాదం వస్తుంది. ఉన్న ఉపాధి పోతుంది. ఉద్యోగాలు పోత్.. అవకాశాలు రావు. భయానకమైన పరిస్థితి వస్తది.. ఒక పక్కనే వస్తనే ఉన్నయ్. దేశంలో మనోత్మాదం, మూకదాడులు పెరుగుతున్నయ్. నలుగురం ఎక్కువం ఉన్నమని ఇద్దరున్నోళ్లను కొట్టుడేనా? ఇది ధర్మమేనా? పద్ధతా? దేశాన్ని నడిపే విధానమా?’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.