న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఖూనీని తిలకిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. శతాబ్ధం క్రితమే ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఇండియాను మన కండ్ల ముందే నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్లను దారుణంగా అటాక్ చేస్తున్నారని, జైలులో వేస్తున్నారని రాహుల్ విమర్శించారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం పెరిగిందని, సమాజంలో హింస కూడా అధికమైనట్లు రాహుల్ అన్నారు. కానీ వీటి గురించి మాట్లాడకుండా ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందన్నారు. కేవలం నలుగురు లేదా అయిదుగురి ప్రయోజనాల కోసం ప్రభుత్వం నడుస్తోందని, ఇద్దరు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్రభుత్వం అండగా ఉంటుందోని ఆరోపించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు ఇవాళ ప్రధాని ఇంటిని చుట్టుమట్టనున్నారు. ఇక లోక్సభ, రాజ్యసభ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దేశంలో ప్రతి ప్రభుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి వెళ్లిపోయినట్లు ఆరోపించారు. తమ ప్రభుత్వ సమయంలో మౌళికసదుపాయాలు తటస్థంగా ఉండేవని, కానీ ఇప్పుడు ఒకే పార్టీ తరపున ప్రభుత్వ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియాతో చాలా మంది రోడ్డున పడ్డారన్నారు.