హనుమకొండ, నవంబర్ 21 : కేంద్రంలోని మోదీ సర్కారు రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటా నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు, తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో వెన్నంటి ప్రోత్సహిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు, ముఖ్యంగా స్టేషన్ఘన్పుర్ నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పారిశ్రామిక, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అందులో భాగంగా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. మొత్తం 13 సంవత్సరాలు పాలించిన బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, విజన్ లేకపోవడంతో దేశం వెనుకబడి పోయిందన్నారు. రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ నాయకులు దేశానికి ఏదో చేసినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని.. అవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో భారతదేశ అభివృద్ధి సూచిక(జీడీపీ) తగ్గుతూ వస్తుంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో ఎలా పెరిగిందో విశ్లేషించుకోవాలన్నారు. గొప్పగా పాలన చేస్తే దేశ జీడీపీ ఎందుకు తగ్గిందని ఇందుకు మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రెండు పంటలకు నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు ఇవ్వడంతో పాటు అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ విధానాలతో రైతుల నడ్డి విరుస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ.10 లక్షల 60వేల కోట్ల బకాయిలు మాఫీ చేసిన కేంద్రం రైతులను ఆదుకోకుండా, పంటలను కొనకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి పంటను కేంద్రమే కొనాలని నిల్వలు ఎక్కువైతే ఎగుమతి చేయాలని చెప్పారు. రైతుల పోరాట పటిమ, ఉద్యమస్ఫూర్తితో ఇవాళ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేరుగా ధర్నాలో కూర్చొని కేంద్రాన్ని హెచ్చరించారన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో పండించిన పంటలను కొనుగోలు చేస్తే రూ.11వేల కోట్ల నష్టం వచ్చిందని, అయినా ముఖ్యమంత్రి రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కానీ, మోదీ ప్రభుత్వం పంటలను కొనకుండా రైతులను అప్పులఊబిలోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏటా 2కోట్లు ఉద్యోగాల చొప్పున 14కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. లాభాలు తెచ్చిపెట్టే ఎల్ఐసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా రూ.3లక్షల 74వేల కోట్లు సేకరించారన్నారు. ఆహార సూచికలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా భారత్ వెనుకుండడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు ఆహార కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలుచేయడం లేదన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్న కడియం.. ముందుగా వీటన్నింటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. చైతనైతే సహాయం చేయండి.. అంతేకాని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన హితవు పలికారు.