నల్లబెల్లి, నవంబర్ 9: పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని మేడపెల్లిలో మంగళవారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై అవగాహన సదస్సును సర్పంచ్ లావుడ్యా తిరుపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్నతో కలిసి అదనపు కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఫారెస్టు భూములను రక్షించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని సంకల్పించారన్నారు. మండలంలోని మేడపెల్లి, అసరవెల్లి, గోవిందాపూర్, నల్లబెల్లి, మూడుచెక్కలపల్లె, రాంపూర్లోని ఏజెన్సీ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఎఫ్ఆర్సీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా దరఖాస్తులు అందించాలన్నారు.
మాటకు కట్టుబడిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. పోడు రైతులకు పట్టాలు వస్తే రైతుబీమా, రైతుబంధు పథకాలతోపాటు పంట రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా విచక్షణారహితంగా అడవులు నరికి వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అతివృష్టి, అనావృష్టిని ఎదుర్కొని పలుమార్లు కరువు కాటకాలను చవిచూశారని గుర్తుచేశారు. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన అటవీ భూములను క్రమబద్ధీకరించి, ఫారెస్టు భూములను రక్షించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. గ్రామాలకు వచ్చే అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులకు రైతులు అన్నివిధాలా సహకరించి పోడు భూములకు పట్టాలు పొందాలని కోరారు. సదస్సులో ఎంపీపీ ఊడ్గుల సునీతాప్రవీణ్, తాసిల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో విజయ్కుమార్, ఎఫ్ఆర్వో శ్రీనివాస్, ఎంపీవో కూచన ప్రకాశ్ పాల్గొన్నారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
ఖానాపురం: అర్హులైన పోడు రైతులందరికీ హక్కుపత్రాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దార్ జులూరి సుభాషిణి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అధ్యక్షతన మండల పరిధిలో పోడు భూములు కలిగిన 26 హ్యాబిటేషన్ల ఎఫ్ఆర్సీ చైర్మన్లు, కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పోడు భూములు కలిగిన గిరిజన, గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గిరిజనులైతే కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి భూమిని గ్రామ కమిటీ పరిశీలిస్తుందన్నారు. గ్రామ కమిటీలో హక్కు పత్రానికి ఆమోదం పొందని పక్షంలో 60 రోజుల వ్యవధిలో డివిజన్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్కడ కూడా ఆమోదం లభించకపోతే 60 రోజుల్లో జిల్లా కమిటీకి దరఖాస్తు అందించాలని వివరించారు. జిల్లా కమిటీదే తుది నిర్ణయమన్నారు. భూమి ఒక జిల్లాలో ఉండి ప్రస్తుతం మరో జిల్లాలో నివసిస్తే.. నివసించే జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలని ఎఫ్ఆర్వో రమేశ్ సూచించారు. ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యుల అనుమానాలను అధికారులు పూర్తిస్థాయిలో నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనవాణి, డీఆర్వో మోహన్, కార్యదర్శులు పాల్గొన్నారు.
కమిటీ సభ్యులకు అవగాహన
నెక్కొండ: మండల పరిషత్ కార్యాలయంలో అటవీ పరిరక్షణ కమిటీ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ జాటోత్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాసిల్దార్ డీఎస్ వెంకన్న మాట్లాడుతూ పోడు భూములు సాగు చేసుకుంటున్న లబ్ధిదారులను నిస్పక్షపాతంగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్వో నరేశ్, డీటీ రాజ్కుమార్, ఎంపీడీవో రవి, ఎఫ్ఆర్వో శోభన్ పాల్గొన్నారు.