ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులోనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా నాలుగో విజయంతో కదం తొక్కింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ మ్యాస్ట్రో విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్కు తోడు రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్ మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు పంజాబ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం బంతితో పంజాబ్ను కట్టడిచేసి ఘనవిజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో టీమ్గా నిలిచింది.
RCB | ధర్మశాల: ఆరంభంలో వరుస పరాజయాలతో నిరాశపరిచినా ఐపీఎల్ -17 రెండో దశ నుంచి జూలు విదిల్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను ఓడించి వరుసగా నాలుగో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 242 పరుగుల ఛేదనలో పంజాబ్.. 181 పరుగులకే చేతులెత్తేయడంతో 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. రన్ మిషీన్ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 92, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా రజత్ పాటిదార్ (23 బంతుల్లో 55, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. భారీ ఛేదనలో పంజాబ్.. 17 ఓవర్లలో 181 పరుగులే చేయగలిగింది. రిలీ రూసో (27 బంతుల్లో 61, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శశాంక్ సింగ్ (19 బంతుల్లో 37, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
మ్యాచ్ ఆరంభంలోనే 3, 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఇచ్చిన క్యాచ్లను పంజాబ్ ఫీల్డర్లు నేలపాలు చేయడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. డుప్లెసిస్ (9), జాక్స్ (12) నిరాశపరిచినా పాటిదార్తో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. హర్షల్ పటేల్ 6వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన పాటిదార్.. రాహుల్ చాహర్ 8వ ఓవర్లో 3 సిక్సర్లతో రెచ్చిపోయాడు. పాటిదార్ ఇచ్చిన రెండు క్యాచ్లనూ పంజాబ్ ఫీల్డర్లు జారవిడవడం ఆర్సీబీకి కలిసొచ్చింది. 21 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన అతడిని సామ్ కరన్ ఔట్ చేశాడు. మరో ఎండ్లో కోహ్లీ.. లివింగ్స్టొన్ 13వ ఓవర్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తిచేశాక మరింత జోరు పెంచాడు. కరన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు అర్ష్దీప్ 18వ ఓవర్లో 4,6తో 90లలోకి వచ్చిన విరాట్.. అదే ఓవర్లో నాలుగో బంతికి కవర్స్ వద్ద రూసోకు క్యాచ్ ఇచ్చి శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో కామెరున్ గ్రీన్ (27 బంతుల్లో 46, 5 ఫోర్లు, సిక్స్), దినేశ్ కార్తీక్ (18) మెరుపులతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులోకి వచ్చిన పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో బంతికే ప్రభ్సిమ్రన్ (6) వికెట్ కోల్పోయింది. వన్డౌన్గా వచ్చిన రూసో.. బెయిర్ స్టో(27)కు జతకలిసి దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో ఊపు మీద కనిపించిన బెయిర్ స్టోను ఫెర్గూసన్ ఔట్ చేశాడు. ఎదుర్కున్న తొలి బంతి నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డ రూసో.. సిరాజ్ 4వ ఓవర్లో 3 ఫోర్లు, ఓ సిక్స్తో జోరు పెంచాడు. కానీ ఫెర్గూసన్ ఆరో ఓవర్లో బెయిర్ స్టోను ఔట్ చేశాడు. అతడి స్థానంలో వచ్చిన శశాంక్ సింగ్ కొంతసేపు పోరాడాడు. 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్న రూసోను కర్ణ్ శర్మ బోల్తా కొట్టించడంతో పంజాబ్ తడబడింది. శశాంక్ను కోహ్లీ రనౌట్తో వెనక్కి పంపగా జితేశ్ (5), లివింగ్స్టొన్ (0), అశుతోష్ (8), కరన్ (22) విఫలమయ్యారు. లోయార్డర్ బ్యాటర్లను సిరాజ్ (3/43) ఔట్ చేయడంతో ఆర్సీబీకి భారీ విజయం సాధ్యమైంది. స్వప్నిల్సింగ్, ఫెర్గుసన్, కర్ణ్శర్మ రెండేసి వికెట్లు తీశారు.
బెంగళూరు: 20 ఓవర్లలో 241/7 (కోహ్లీ 92, పాటిదార్ 55, హర్షల్ 3/38, విద్వత్ 2/36).
పంజాబ్: 17 ఓవర్లలో 181 (రూసో 61, శశాంక్ 37, సిరాజ్ 3/43, స్వప్నీల్ 2/28)