హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీ విభజన రాజకీయలు దేశంలో మతహింసను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. దీంతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజన, మైనారిటీలపై ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతున్నాయన్నారు.
మఖ్దూం భవన్లో మంగళవారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవిద్యభరిత, సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలు కగిలిన భారత దేశాన్ని అఖండ హిందూ దేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకోసమే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.
ప్రశ్నించేవారిపై దేశద్రోహం లేదా ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలన్నారు. సెప్టెంబర్4 నుంచి 7 వరకు శంషాబాద్లో నిర్వహించే పార్టీ మహాసభలను చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్పాషా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు తదితరులు పాల్గొన్నారు.