భోపాల్ : మధ్యప్రదేశ్లో వరదలు చాలా మంది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. కానీ, ఇవి కొందరికి వరంలా మారాయి. భారీ వర్షాలకు అశోక్నగర్లోని పంచవాలి గ్రామంలోని సింధ్ నది పొంగిపొర్లుతోంది. ఆదివారం వరద కాస్త తగ్గుముఖం పట్టింది. నది తీరంలో పలువురికి ఇసుకలో వెండి నాణేలు దొరికాయి. ఈ వార్త గ్రామమంతా దవాణంలా వ్యాపించగా.. గ్రామస్తులంతా నది ఒడ్డుకు చేరి పోటీపడి మరీ నాణేలను ఏరుకుంటున్నారు. అయితే, ఈ వెండి నాణేలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. నాణేలపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి.
1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. మొదట్లో రెండు నాణేలు లభించాయి. ఆ తర్వాత గ్రామస్తులు వెతికితే ఏడెనిమిది వరకు దొరికాయి. అయితే, నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయో అంతుపట్టడం లేదు. దీనిపై కొలరాస్ ఎస్డీపీఓను సంప్రదించగా.. నాణేలపై సోషల్ మీడియా ద్వారా తమకు సమాచారం తెలిసిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్టేషన్ ఇన్చార్జిని పంపినట్లు తెలిపారు. అయితే, నాణేలు ఎవరో వ్యక్తి ఇంట్లో దాచి ఉండగా.. వరదలు కొట్టుకువచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విలువైన పురాతన నాణేలు దొరకడంతో గ్రామస్తులంతా ఇసుకలో, నదిలో నాణేల కోసం అన్వేషిస్తున్నారు.