కారకాస్ : ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్కు వినియోగానికి వెనిజులా ఆమోదం తెలిపినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) శనివారం తెలిపింది.
గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనాకు వ్యతిరేకంగా 79.4శాతం ప్రభావంతంగా పని చేస్తుందని ఆర్డీఐఎఫ్ తెలిపింది. ధర మోతాదాకు పది డాలర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వెనిజులా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను వినియోగిస్తుందని, సింగిల్ డోస్ వ్యాక్సిన్ సైతం టీకాలు వేగవంతం చేయడంలో సహాయపడుతుందని ఆర్డీఐఎఫ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. స్పుత్నిక్ వీ రెండు డోసుల వ్యాక్సిన్కు భారత్లో అత్యవసర వినియోగానికి భారత్లోనూ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో టీకాల పంపిణీ ప్రారంభం కానుంది.