US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు. ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై తదుపరి చర్యలు నేటి (మంగగళవారం) నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారని కూడా సెర్గియో తెలిపారు. ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహం స్వచ్ఛమైందని, ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని వారు పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఇండియా-అమెరికా మిత్ర దేశాలు. ఉన్నతస్థాయిలో సంబంధాలు కలిగి ఉన్నాయి. నిజమైన స్నేహితులు కొన్ని అంశాల్లో విబేధించవచ్చు. కానీ, వారి మధ్య సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇండియా ప్రపంచంలోనే పెద్ద దేశం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం చాలా అవసరం. వాణిజ్య ఒప్పందంతోపాటు, రక్షణ, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో ఇరు దేశాల్లో్ కలిసి పని చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగాను. ట్రంప్ తో కలిసి పని చేశా.
మోదీతో ట్రంప్ స్నేహం ప్రత్యేకమైందని మాత్రం చెప్పగలను. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరోస్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చా. ట్రంప్ వచ్చే ఏడాది ఇండియాలో పర్యటిస్తారు. ట్రంప్ అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేస్తారు. ఇండియాలో టైం వేరే ఉంటుంది కాబట్టి.. ఇది ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని సెర్గియో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇండియా.. ప్యాక్స్ సిలికా అలయన్స్ లో చేరాలని భావిస్తున్నట్లు తెలిపారు.