న్యూఢిల్లీ : కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)గా కొనసాగే అవకాశం లేదు. బెంగళూర్లో మంగళవారం 20 పార్టీలకు పైగా పాల్గొనే విపక్షాల మెగా భేటీలో (Opposition Meet) యూపీఏ పేరు మార్పు దిశగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండు సార్లు అధికారంలో ఉంది.
విపక్ష సంకీర్ణం పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీనిపై విపక్ష భేటీలో సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. విపక్ష పార్టీలన్నీ యూపీఏ పేరు మార్పుపై విస్తృతంగా చర్చించి ఈ భేటీలోనే ఓ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల సర్ధుబాటుపైనా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు.
కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలను ఏకం చేసే దిశగా అవసరమైన వ్యూహాలను ఖరారు చేస్తారు. విపక్షాలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ కోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈవీఎంలు, ఎన్నికల సంస్కరణలపైనా ఈ సమావేశంలో విపక్షాలు చర్చించనున్నాయి. ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్వాగతోపన్యాసంతో మంగళవారం విపక్షాల సమావేశం ప్రారంభం కానుండగా తొలి రోజు భేటీ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సంయుక్త విలేకరుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More :
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో మరో తమిళ మంత్రి ఇంటిపై ఈడీ దాడులు..