కోల్కతా: పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. ఆయన సొంత నియోజకవర్గమైన కూచ్ బేహార్లో (Cooch Behar) కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్కు ఆయన వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమద్యంలో భారీగా గుమికూడిన ఆందోళనకారులు ఆయన కాన్వాయ్ని (Convoy) అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడిచేశారు. దీంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిసిత్ ప్రమాణిక్.. ఇది తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) కార్యకర్తల పనేనని ఆరోపించారు. స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రినైనా తనకే సరైన భద్రత లేనప్పుడు, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిద్వారా బెంగాల్లో ప్రజాస్వామ్యం ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది స్థానిక గిరిజనులను చంపడంతో కేంద్ర మంత్రిపై ఆ వర్గంవారు ఆగ్రహంగా ఉన్నారని లోకల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రమాణిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖ పరిధిలోనే బీఎస్ఎఫ్ (Border Security Force) విభాగం ఉన్నదని, అయినప్పటికీ ఆయన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మంత్రిని అడ్డుకున్నారని తెలిపాయి.