హైదరాబాద్ : ఈ నెల 27న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. సమావేశానికి హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంపై చర్చించనున్నది. సమావేశానికి సంబంధించి ఎజెండాలో 14 అంశాలను చేర్చారు. షెడ్యూల్ 9లోని ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల విభజన, ఫైనాన్స్ కార్పొరేషన్లు, షెడ్యూల్ 9లో ప్రస్తావించిన సంస్థల పంపిణీపై చర్చ జరుగనున్నది. సింగరేణి, ఏపీ హెవీ మెషనరి ఇంజినీరింగ్ నగదు, బ్యాంకు నిల్వలు, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై తీసుకున్న అప్పుల విభజన, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఏపీకి ఇవ్వాలని నిధులు, సింగరేణి కాలరీస్, ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నారు.