న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మూడవ సంవత్సరం మెడికల్ విద్యార్థుల కేఆర్ఓకే 1 పరీక్షను.. వచ్చే వార్షిక సంవత్సరానికి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రమాణిక అవసరాలను పూర్తి చేసిన విద్యార్థులను అక్కడ ప్రభుత్వం పాస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన అంశంలో భారత్ శాంతిని కాంక్షించిందన్నారు. తక్షణమే హింసను ఆపాలన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ నమ్ముతోందని, హింసకు ముగింపు పలకాలని ఆయన కోరారు. శాంతి స్థాపన కోసం ఇండియా ఎటువంటి సహాయానికైనా సిద్ధంగా ఉందన్నారు. రక్తపాతాన్ని సృష్టించి, అమాయకులు ప్రాణాలు తీస్తే సమస్యను పరిష్కరించలేమన్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ఒకవేళ కేంద్ర మంత్రులు వెళ్లకుండా ఉంటే, అప్పుడు ఆ దేశాల నుంచి ఇంత మంచి స్పందన వచ్చేదికాదన్నారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారన్నారు.