ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్రలో పూర్తిస్ధాయి లాక్డౌన్కు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్ధితిపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న క్రమంలో భేటీ అనంతరం ఈ దిశగా ఠాక్రే ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజూ వెలుగుచూస్తున్న కొవిడ్ కేసుల్లో దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాత్రి వేళల్లో కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్డౌన్ విధించారు.
వైరస్ వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు కఠిన లాక్డౌన్ అవసరమని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇక మహారాష్ట్రలో శనివారం ఏకంగా 59,000 తాజా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32.88 లక్షలకు ఎగబాకింది. 57,329 మంది మహమ్మారి బారినపడి మరణించారు.