కోనరావుపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం తలెత్తడంతో ఓ రైతుపై ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య అదే గ్రామానికి చెందిన మహిపాల్,
మల్లికార్జున్ అనే వ్యక్తుల మధ్య కొద్ది రోజులుగా భూమికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో మంగళవారం గురక ఎల్లయ్య పై మహిపాల్, మల్లికార్జున్ కర్రలు, గొడ్డలితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.