న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పసుపు ఎగుమతులు పెరిగినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ.. కరోనా నియంత్రణలో భారతీయ చికిత్సా విధానం బాగా పనిచేసిందన్నారు. ఆ విధానాలు ప్రపంచ దేశాలను ఆకర్షించినట్లు ఆయన చెప్పారు. దానిలో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే పసుపు పంట అధిక స్థాయిలో ఎగుమతి అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. హోలిస్టిక్ హెల్త్ కేర్ విధానంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ఆధునిక చికిత్సతో పాటు భారతీయ ప్రాచీన చికిత్స విధానాన్ని కూడా కరోనా సమయంలో అవలంబించినట్లు ప్రధాని వెల్లడించారు. ఆయుష్ మంత్రాలయం కూడా బాగా పనిచేసిందన్నారు.
కరోనాపై ప్రజెంటేషన్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశానికి డుమ్మా కొట్టిందని, అంతేకాదు, ఇతర పార్టీలను వెళ్లకుండా చేసే ప్రయత్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. గత రెండేళ్లలో గత కొన్ని పార్టీలు అపరిపక్వత ప్రదర్శించినట్లు ఆయన విమర్శించారు. స్వార్ధపూరిత రాజకీయాలను కొన్ని పార్టీలు ప్రదర్శించినట్లు ఆయన వెల్లడించారు. భారతీయ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా కూడా కొందరు ప్రచారం నిర్వహించినట్లు మోదీ ఆరోపించారు.