పుదుచ్చేరి, అక్టోబర్ 1: పుదుచ్చేరి ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల నిరసన ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, సీఎం రంగస్వామికి తగిలింది. పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు వరుసగా నాలుగో రోజు చేపట్టిన నిరవధిక సమ్మెతో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం ఇండ్లకు సైతం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా ఆగిపోవటంతో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. కరెంట్ లేక పుదుచ్చేరి వీధులను చీకట్లు ఆవరించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని వీధులు చీకట్లను ఆవరించటంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి.
భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇండ్లలో కరెంటు లేకపోవటంతో పుదుచ్చేరి వాసులు రోడ్లమీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడి సర్కారు విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పోలీసులు, ఇతర సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దించింది. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 25 సభ్యుల బృందాన్ని పంపి విద్యుత్తు పునరుద్ధణ పనులు చేపడుతున్నది. కాగా, విద్యుత్తు ఉద్యోగుల సమ్మెతో సంస్థకు ఇప్పటికే రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం.
విద్యుత్తు ఉద్యోగుల నిరసన
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే యత్నాలకు నిరసనగా అక్కడి విద్యుత్తుశాఖ ఉద్యోగులు, ఇంజినీర్లు సెప్టెంబర్ 28 నుంచి చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావంగా టీఎస్ఎస్పీడీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు శనివారం హైదరాబాద్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 20 లక్షల మంది ఉద్యోగులు,ఇంజినీర్లు నిరవధిక నిరసనలు, సమ్మెకు దిగుతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు తెలిపారు. నవంబర్లో విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో పెట్టేందుకు కేంద్రం యత్నిస్తున్నదని, దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పారు.