హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాగా.. విద్యాశాఖపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణ, ఆంగ్ల మాధ్యమంలో బోధనపై అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసింది.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో.. ‘మన ఊరు – మన బడి’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.