బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం ఎంతవరకైనా పోరాడుతామని, కేంద్రం మెడలు వంచైనా ఫ్యాక్టరీని సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పరిశ్రమ సాధన కోసం బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు తలపెట్టిన ఒక్క రోజు నిరసన దీక్షకు మహబూబాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు సహా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ సర్కారు, నేతల తీరుపై వారు నిప్పులు చెరిగారు. కేంద్రంపై ఒత్తిడి చేయలేని రాష్ట్ర బీజేపీ నాయకులు దద్దమ్మలని, వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బయ్యారం, ఫిబ్రవరి 23 : గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు ఒక్క రోజు నిరసన దీక్ష తలపెట్టారు. ఈ దీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ బయ్యారంలో నాణ్యమైన ఇనుప ఖనిజం ఉండడం వల్లే విభజన చట్టంలో పరిశ్రమకు హామీ లభించిందన్నారు. చేతగాని దద్దమ్మ లాంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపే నేతలు బయ్యారం ఉక్కులో నాణ్యత లేదంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విభజన సమయంలో ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి ఏ ఒక్క హామీనీ నెరవెర్చలేదని మండిపడ్డారు. కేంద్రంతో కొట్లాడలేని రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ కిషన్రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజానీకం తీవ్ర మనోవేదనకు గురైందని, కేంద్రంతో మాట్లాడలేని మంత్రి.. తెలంగాణలో పుట్టి ఏం ప్రయోజనమంటూ వారు బాధపడుతున్నారన్నారు. మానుకోట పోరాటాల పురిటి గడ్డ అని.. బిడ్డా కిషన్రెడ్డి ఖబాడ్దార్ అంటూ కవిత హెచ్చరించారు. గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మల సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. బయ్యారంలో నాణ్యమైన ఖనిజం ఉందని జీఎస్ఐ, సెయిల్ వంటి కేంద్ర బృందాలు తేల్చిచెప్పాయని చెప్పారు. ఉక్కు పరిశ్రమ కావాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయలేని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మంత్రి దయాకర్రావు ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్కు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉద్యమంతో తెలంగాణలో కేంద్రపై పోరుకు అగ్గిరాజుకున్నట్టేనని పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మొండివైఖరి వీడాలన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, ఎంపీలు గుజరాత్ గులాంలా పనిచేస్తున్నారన్నారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని ఇనుప ఖనిజం బయ్యారంలో ఉందన్నారు.