న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివి మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లింగయ్య యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. గత రెండు, మూడు నెలల నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీజేపీతోనే అభివృద్ధి అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్లినా తమకు సంబంధం లేదు. కానీ తమ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ మూడున్నరేండ్లలో ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించావు అని నిలదీశారు. ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నావా? అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో తాను, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు కనబడకుండా పోయావని పేర్కొన్నారు. బాధ్యతగా టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడులో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎన్నిసార్లు పిలిచినా రాజగోపాల్ రెడ్డి రాలేదని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఇచ్చే కల్యాణలక్ష్మీ చెక్కులు కూడా పంపిణీ చేయలేదన్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడని లింగయ్య యాదవ్ పేర్కొన్నారు.
మునుగోడు ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నిక వచ్చిన టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. మునుగోడులో ఎగిరిదే గులాబీ జెండానే అని తేల్చిచెప్పారు. నిన్ను గెలిపించినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబమంతా రాజకీయాల్లో ఉండి.. వ్యాపారాల కోసం ఆ పార్టీ.. ఈ పార్టీ అని చూస్తున్నారని లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు.