హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఒక్క బక్కపలచని వ్యక్తి గెల్లు శ్రీనును ఓడించడానికి మేకల మందపై తోడేళ్లలెక్క పడుతున్నారని బీజేపీని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ..” మీరంతా నిండు మనస్సుతో నన్ను దీవించి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ తో మాట్లాడి సొంత ఇంటి జాగ ఉన్న వాళ్లకు ఇల్లు కట్టిస్తానని…ఒక్కసారి నన్ను గెలిపించండి.. మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఒక్కసారి మీ తమ్ముడు గెల్లు శ్రీనుకు అవకాశం ఇవ్వండి. హుజురాబాద్ రూపురేఖలు మారుస్తానని గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, గాదరి కిషోర్, జడ్పీటీసీ రాంశ్యాం, ఎంపీపీ దోడ్డే మమత, నాగంపేట, శాయంపేట, బిజిగిరిషరీఫ్, గండ్రపల్లి, సింగిల్ విండో డైరెక్టర్లు, తనుగుల ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచిన బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? అని మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ నేతలను నిలదీశారు. మంత్రి గంగుల కమలాకర్ శనివారం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ 22 వ వార్డు, అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను స్థానికులతో పాటు పట్టణ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, డాక్టర్లు పెద్ద ఎత్తున కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి తమ మద్దత్తు తెలిపారు. ఈ సందర్బంగా గంగల కమలాకర్ మాట్లాడుతూ.. బీజేపీ అసమగ్ర విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతుందని, అన్ని అంశాల్లో విఫలమై దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నదని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులు ఎలా బతుకాలో చెప్పాలని గంగుల బీజేపీని ప్రశ్నించారు.
సామాన్యుల్ని దోచి బడాబాబులకు దేశాన్ని అప్పజెప్పే పచ్చి అవకాశ వాదుల్ని తరిమేయాలని ఆయన హితవు పలికారు.విజ్ఞులైన ప్రజలు అన్నీ ఆలోచిస్తారని టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజురాబాద్ లో గతం కన్నా భారీ మెజార్టీతో కేసీఆర్ బలపర్చిన గెల్లు గెలువబోతున్నారని గంగుల పేర్కొన్నారు. ఈ నెల ముప్పైన జరిగే పోలింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని మంత్రి గంగుల కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు డాక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు