టీఆర్ఎస్ బీమా పరిహారం చెక్కుల పంపిణీలో జడ్పీ, సీడ్స్ చైర్మన్లు
బోనకల్లు, జూన్ 25: కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కొండంత అండగా ఉంటోందని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రేణుల కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే పార్టీ అధినేత సీఎం కేసీఆర్.. సభ్యత్వమున్న కార్యకర్తలందరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. మండలంలో సీతానాగారం, రావినూతన గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ సభ్యులు తాళ్లూరి మరియమ్మ, ఫణికుమార్ ఇటీవల మృతిచెందారు.
వారికి పార్టీ సభ్యత్వం ఉండడంతో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారం మంజూరైంది. దీంతో జడ్పీ, సీడ్స్ చైర్మన్లు ఈ పరిహారం చెక్కులను శనివారం మృతుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటున్న టీఆర్ఎస్.. బీమా పరిహారంతో పార్టీ సభ్యులకు కొండంత అండగా ఉంటోందని అన్నారు.