ఉత్త్తరాఖండ్లో త్రిముఖ పోరు
బీజేపీలోఅంతర్గత కుమ్ములాటలు
బంధుప్రీతితో కాంగ్రెస్ సతమతం
జాతీయ పార్టీలకు ఆప్ సవాల్
నామమాత్రంగా బీఎస్పీ, ఎన్సీపీ
మరో రెండు మాసాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి ఉత్తరాఖండ్ సంసిద్ధమవుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. రాష్ట్రంలో రానున్నది తమ ప్రభుత్వమేనని కాంగ్రెస్ గంపెడాశతో ఉండగా, మరో ఐదేండ్లపాటు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని బీజేపీ ధీమాతో ఉన్నది. ఆకర్షణీయ హామీలతో ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆప్ వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నది.
70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 57 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ 11 సీట్లను గెలుచుకొన్నది. మిగతా రెండు సీట్లను స్వతంత్రులు కైవసం చేసుకొన్నారు. బహుజన్ సమాజ్పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తొలిసారిగా ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నది.
సీనియర్లతో తలనొప్పులు
2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగేండ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఎన్నికల్లో కీలకమయ్యే కుల, మత సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఠాకూర్ వర్గానికి చెందిన పుష్కర్సింగ్ ధామీని సీఎంగా గత జూలైలో అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. హరాక్ సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్, ధన్సింగ్ రావత్, బిషన్ సింగ్ చౌపాల్ తదితరులు సీఎం పదవి కోసం వేర్వేరు క్యాంపులను ఏర్పాటు చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కున్వర్ ప్రణవ్ సింగ్, శైలారాణి రావత్, శైలేంద్ర మోహన్ సింఘాల్, ప్రదీప్ బాత్రా వంటి నేతలు సొంత గూటికి వెళ్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. దీంతో నేతలను శాంతిపర్చే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్నది.
ఆకర్షణీయ హామీలు
యూపీ, పంజాబ్, గోవాలో బరిలో ఉన్నట్టు ప్రకటించిన ఆప్ ఉత్తరాఖండ్ ఎన్నికలనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. అధికారంలోకి వస్తే, 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు నెలకు రూ.వెయ్యి, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ.5 వేలు, ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాల భర్తీ వంటి ఆకర్షణీయమైన హామీలను కురిపించారు. సీఎం అభ్యర్థిగా కర్నల్ అజయ్ కోటియాల్ (రిటైర్డ్)ను ప్రకటించారు. మిగతా పార్టీలతో పోలిస్తే, ఎన్నికల ప్రచారంలో ఆప్ దూసుకుపోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంధుప్రీతితో అస్తవ్యస్తంగా..
రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో ప్రభావం చూపగల నేతలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ తొలుత భావించింది. అయితే పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావత్, ప్రీతవ్ు సింగ్, రంజిత్ సింగ్, యశ్పాల్ ఆర్య తమ కుమారులు, బంధువులకు టికెట్లు ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఫార్ములాను తాను వ్యతిరేకిస్తానని మరో కీలక నేత గణేశ్ గొడియాల్ బహిరంగంగానే ప్రకటించడం కాంగ్రెస్కు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. రాష్ట్ర ఇంచార్జి దేవేందర్ పనితీరుపై హరీశ్ రావత్ చేసిన విమర్శలు పార్టీలో ఐక్యతలేమిని ప్రస్ఫుటం చేసింది.