TTD : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఇవాళ ఉదయం కూడా 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. అనంతరం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 67,294 మంది స్వామివారిని దర్శించుకోగా.. 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.94 కోట్లు సమకూరాయి. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.