తిరుమల : కొన్ని రోజులుగా తిరుమల (Tirumala) లో కురిసిన వర్షాలతో జలాశయాలు ( Reservoirs ) నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో పాపనాశనం డ్యామ్ (Papanasanam Dam ) వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు( Chairman BR Naidu) ఆదివారం ప్రత్యేక పూజలు, గంగ హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు.
పాపవినాశనం, గోగర్భం డ్యామ్లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా, తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ల నుంచి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు.
తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్యామ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను అభినందించారు.
టీటీడీ చరిత్రలో రికార్డుస్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.