యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవితధారణ, కన్యావననం, స్వామివారి పాదప్రక్షాళన, నూతన వస్త్ర సమర్పణ, మహా సంకల్పం, చూర్ణిక, లగ్నాష్టకం, కన్యాదానం, మంగళసూత్యధారణ, బ్రహ్మముడి, అక్షతరోపణ వంటి వైదృష్య కార్యక్రమాలు మంగళనిరాజన మంత్రపుష్పాలతో కల్యాణ కైంకర్యం ముగించారు.
మొదటగా ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించి, స్వామి, అమ్మవార్లను గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. స్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తిక సందడి నెలకొన్నది. కార్తిక మాసం 3వ సోమవారం కావడంతో అర్చకులు, పురోహితులు విశేష పూజలు జరుపగా తెల్లవారుజాము నుంచే మహిళలు దీపారాధన చేపట్టి వ్రతపూజల్లో పాల్గొన్నారు. వ్రత మండపంలో తులసీ దామోదర వ్రతం అత్యంత వైభవంగా సాగింది. స్వయంభువులకు నిత్యారాధనలు పంచరాత్రాగమశాస్త్రరీతిలో జరిగాయి.
తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధిసేవ, దర్బార్ సేవ నిర్వహించారు.