మిగ్జాం తుఫాను చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేయడం మనం చూస్తున్నాం. పెద్దఎత్తున జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అయితే నష్టం కేవలం చెన్నైకే పరిమితం కాలేదు. తుఫాను వల్ల మన రాష్ట్రంలోనూ, అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో భారీగా వానలు కురిసి పంట నష్టం జరిగింది. తెలంగాణలో ఖమ్మం నుంచి పెద్దపల్లి దాకా భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి, మిర్చి, వరి రైతులు నష్టపోవడం బాధాకరం. చేతికందివచ్చిన పంట నీటిపాలు కావడం రైతులకు గుండెకోతను మిగిల్చింది.
అతివృష్టి, అనావృష్టి ఒకదాని వెన్నంటి మరొకటి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి తీవ్రస్థాయిలో ప్రబలడం కనిపిస్తున్నది. ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటి వనరులను తగినంతగా పెంచుకోవడం వల్ల అనావృష్టి సమస్యను కొంత అధిగమించగలుగుతున్నాం. కానీ అతివృష్టి వల్ల ఏర్పడే ఉత్పాతాలను మాత్రం ఎటూ తప్పించుకోలేక గుడ్లప్పగించి చూడాల్సి వస్తున్నది. గత జూలైలో రాష్ట్రంలో కురిసిన భారీవర్షాల కారణంగా 18 మందికి పైగా మృతిచెందడం, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లడం తెలిసిందే. వాటి నుంచి కోలుకునేలోగా సెప్టెంబర్లో మళ్లీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు మరోసారి తుఫాను కారణంగా వానలు దంచి కొట్టడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. పంటనష్టాలతో పాటుగా ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల నుంచి బొగ్గు వెలికితీతకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నిజానికిది తెలంగాణ లేదా తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్య కానే కాదు. ఇది విశ్వవ్యాప్తంగా విషమసమస్యగా మారింది. ఎండలు నిప్పులు చెరుగుతుంటే, వానలు వరదలై ముంచెత్తుతున్నాయి. ఈ ఎండావానల దాగుడుమూతల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమవుతున్నది. ఒక అంచనా ప్రకారం దేశంలోని సుమారు 40 శాతం జిల్లాలు ఈ తరహా ఎండావానల దాగుడుమూతల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఈ విషవలయానికి మూలాలు వెదకడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాలుష్యం శ్రుతిమించి పోవడం వల్ల భూతాపం పెరుగుతున్నది. సముద్రాలు వేడెక్కి ఎల్నినో ప్రభావంతో వాతావరణ మార్పులు వస్తున్నాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా దీనికి ప్రపంచ దేశాలన్నీ బాధ్యులే. ప్రధానంగా సంపన్న, పారిశ్రామిక దేశాలు సృష్టిస్తున్న కాలుష్యం, అడవుల నరికివేత భూమికి ఊపిరి సలుపనివ్వడం లేదు. భూతాపం తగ్గించేందుకు ఇటీవల నిర్వహిస్తున్న కాప్ సదస్సుల్లో తమవంతు బాధ్యత నిర్వహించేందుకు మొండిగా నిరాకరిస్తున్నవీ సంపన్న దేశాలే కావడం గమనార్హం. ఉత్తమమైన ఉద్దేశాలు కాలుష్యాన్ని సగానికి తగ్గించి, మానవాళిని కాపాడతాయనుకోవడం భ్రమేనని, అన్ని సమస్యల పరిష్కారానికీ ధనమే అవసరం. కనుక ఆయా దేశాలు దీనికీ తగిన నిధులు కేటాయించాల్సి ఉన్నదని ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సంస్థ అధికారి సైమన్ స్టియెల్ నొక్కి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న 28వ కాప్ సభ ఈ దిశగా నిర్ణాయక చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం.