జమ్మికుంట రూరల్: తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే హుజురాబాద్లో పార్టీని గెలిపిస్తాయని వర్థన్నపేట ఎమ్మెల్యే, జమ్మికుంట రూరల్ ఇన్చార్జ్ ఆరూరి రమేష్ అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, వెంకటేశ్వరపల్లి, పాపయ్యపల్లి, విలాసాగర్, సైదాబాద్ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల సమావేశం వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు.
ఈ సందర్బంగా రమేశ్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని నాయకులకు సూచించారు.కులాల వారిగా సమావేశం నిర్వహించి, మహిళల తో బొట్టు కార్యక్రమం చేపట్టి, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆయన సొంత అభివృద్ధి కోసం తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏనాడూ పని చేయలేదని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రతిపక్షాల కళ్ళబొల్లి కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా హుజురాబాద్ లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రావుల శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, ఎంపీపీ దొడ్డే మమత, ఇంచార్జ్ లు, సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇంచార్జిలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.