వీణవంక : తెలంగాణ రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కనపర్తి గ్రామంలో బుధవారం సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల గుండా ర్యాలీ తీసి , ఇంటింటికీ తిరుగుతూ, గ్రామస్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఏళ్ళతరబడి దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని గుర్తించి పవిత్ర ఆశయంతో అభినవ అంబేడ్కర్గా ఆలోచన చేసి దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు.
ఇప్పటికే కొంతమందికి పథకానికి సంబంధించి డబ్బులు అందాయని, మరికొందరికి బ్యాంక్ అకౌంట్లో జమచేయడం జరిగిందని తెలిపారు. ఓడిపోతామనే భయంతో ఈటల రాజేందర్ , బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించి తాత్కాలిక ఆనందం పొందుతున్నారని..నవంబర్ 4 నుండి మళ్ళీ పథకం అమలవుతుందన్నా రు.
హుజూరాబాద్ నియోజకవర్గ దళిత ప్రజలు దళిత బంధుతో ఆర్థికంగా ఎదిగి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.దళితుల కోసం రూ.50 వేలతో ప్రారంభమయిన కళ్యాణ లక్ష్మీ పథకం రూ. ఒక లక్షా నూటపదహార్లకు పెంచి అన్ని వర్గాల వారికి ఏ విధంగా అందజేస్తున్నారో అదే మాదిరిగా దళిత బంధు కూడా రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ అన్ని కులాల, మతాల పేదలకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
పథకాల అమలులో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంటే ధరలు పెంచుతూ బీజేపీ పార్టీ పేదలను ఆర్థికంగా వెనక్కి నెట్టుతుందని అన్నారు. ఈ హుజూరాబాద్ ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, సంక్షేమం వైపు నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి..సంక్షోభం వైపు నడిపిస్తున్న బీజేపీ పార్టీ మధ్య జరుగుతున్న ఎన్నికగా ప్రజలు గమనించాలని కోరారు.
ఈ రోజు స్వార్థం కోసం ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరారని, ఈటల రాజేందర్ను వ్యక్తిగా కాకుండా బీజేపీ పార్టీగా చూడాలని, దళిత వ్యతిరేక వ్యక్తిగా చూడాలని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని , హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా ఏనాడైనా వచ్చాడా.. ఒక్క రూపాయయినా తీసుకువచ్చి పని చేశాడా..ఈటల రాజేందర్కు ఓటు వేస్తే ఏమి జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తున్న, ఎల్ఐసీ ని, అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న , రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తున్న బీజేపీ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. స్థానిక నాయకులు గడపగడపకు తిరుగుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండో చైర్మన్ మాడ సాదవరెడ్డి, సర్పంచ్ పర్లపెల్లి రమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు శశికుమార్, ఏఎస్ఆర్ యువసేన శ్రీనివాస్రెడ్డి, విజయ్, వినయ్, కోల శ్రీనివాస్, రాకేశ్, మల్లేశ్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, నాయకులు తిరుపతి, కవిత, అనూష, నర్సయ్య, బొందయ్య, సందీప్, కోమల్రెడ్డి, వెంకటేశ్, పులి ప్రకాశ్, స్సేన్, తదితరులు పాల్గొన్నారు.