హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూసినా అవినీతి కంపు వస్తున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మొత్తం దేశం నాశనమైంది ఈ బీజేపీ పరిపాలనలో. ఎక్కడ చూసినా అవినీతి కంపు. అన్ని స్థాయిల్లో ఘోరమైన అవినీతి. జాతీయ, అంతర్జాతీయ మీడియా అంతా చెబుతా ఉన్నది. దేశ సంపదలో 77% సంపద పదిశాతం మంది దగ్గర్నే ఉన్నదని లెక్కలు చెప్తున్నయ్. మిగిలిన 90 శాతం మంది దగ్గర 23 శాతం సంపదే ఉన్నది. ఏమైనట్టు మీ (బీజేపీ) ఘనత వహించిన పరిపాలనలో. ధనవంతులు.. ధనవంతులైతున్నరు. పేదలు.. పేదలవుతున్నరు. నిరుద్యోగిత పెరిగింది. ఆర్థిక శాఖలోని నేషనల్ స్ట్రాటజికల్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) చెప్తున్న లెక్కలు ఇవి. నేను చెప్తున్నవి కావు. కేసీఆర్ కవిత్వం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం వెలువరించే లెక్కలే. నిరుద్యోగిత రేటు తెలంగాణలో 0.3 శాతం ఉంటే, దేశంలో సగటున 7 శాతంపైగా ఉన్నది. హంగర్ ఇండెక్స్లో దేశ స్థానం 101 స్థానానికి పడిపోయింది. 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డయ్. దేశంలో కరంటు వాడే పరిస్థితి లేదు.
సీనియర్ రాజకీయ నేతగా చెప్తున్నా..
దేశం కోసం బీజేపీ చేసిందేం లేదు. మీకు చేతనైతే, మీకు గొప్ప నైపుణ్యాలే ఉంటే, మీది గతిశీల ప్రభుత్వమే అయితే, చైనాలో చేసినట్టు మన దేశాన్ని అభివృద్ధి చేయండి. చైనాలో డెంగ్ జియావోపింగ్ చేసినట్టుగా, సింగపూర్లో లీ క్వాంగ్ చేసినట్టుగా మన దేశాన్ని మార్చి చూపండి. వాళ్లు గొప్ప మార్పులు తీసుకొచ్చారు. రాజ్యసభ స్పీచ్లో చిదంబరం గారు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. గోల్మాల్ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఎవర్ని మీరు వంచించదల్చుకొన్నరు. వీళ్లను(బీజేపీని) తరిమికొట్టకపోతే దేశం నాశనమైతది. నిందలు పెట్టాలనో.. అక్కసుతోనే నేను అనట్లేదు. నేనోక సీనియర్ రాజకీయనేతగా చెప్తున్నా. ఎనిమిదేండ్లుగా వేచిచూస్తున్నా. 8వ సంవత్సరమంటే 80శాతం సమయాన్ని మోదీకి ఇవ్వడం అయిపోయింది. 8వ బడ్జెట్ పెట్టేసిండ్రు. మోదీ ఇంకేం చెప్తరు. ఆయన సత్తా ఎంతో, ఆలోచన సరళి ఏందో బయటపడింది. ఇంకా లాభం లేదు.