ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. 219 మందితో రొమేనియాలోని బూచరెస్ట్ నుంచి ప్రారంభమైన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ముంబై చేరుకొన్నది. 250 మందితో మరో విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీకి వచ్చింది. మరికొంతమందిని తీసుకురావడానికి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానం బయల్దేరింది. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో భారతీయులను రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దు దేశాలైన హంగెరీ, రొమేనియా దేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల ద్వారా ఇండియాకు తీసుకువస్తున్నారు. ఎన్నో భయాందోళనలతో ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన భారతీయ విద్యార్థులు స్వదేశం చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబై ఎయిర్పోర్టులో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులతోపాటు భారతీయులను క్షేమంగా తీసుకురావాలని ఇప్పటికే మంత్రి కేటీఆర్తోపాటు పలువురు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్కు చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. ఉక్రెయిన్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చిన విద్యార్థులను ఉచిత విమాన టిక్కెట్లతో హైదరాబాద్కు తీసుకొస్తామని సోమేశ్కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం విద్యార్థులు హైదరాబాద్ చేరుకుంటారని వివరించారు.