ధర్నాచౌక్ దద్ధరిల్లింది. జై జవాన్.. జై కిసాన్.. జై జై కేసీఆర్ నినాదాలతో టీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించారు. ఎండ్లబండ్లు, ట్రాక్టర్లు, వడ్ల బస్తాలు, వరికంకులతో తరలివచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. పంట ఉత్పత్తులను కొనకుండా కాలయాపన చేయడాన్ని తప్పు పట్టారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్న వైనాన్ని తూర్పారబట్టారు. గల్లీ బీజేపీ నాయకులు ఢిల్లీలో చేస్తున్న రాజకీయాన్ని ఎండగట్టారు. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యాన్ని కొనాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ధాన్యం కొనాలంటూ భాగ్యనగరం గర్జించింది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టొద్దని వేడుకుంది. దేశ రైతులందరినీ ఒకేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. అనాదిగా వడ్లు పండిస్తున్న అన్నదాతలను ఆగం చేయొద్దని విన్నవించింది. ఆఖరి గింజ వరకు కేంద్రమే కొనుగోలు చేయాలని నినదించింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా రైతుల మహాధర్నా హోరెత్తింది. అన్నదాతలతో కలిసి గులాబీ శ్రేణులు బైఠాయించి కేంద్రం తీరును ఎండగట్టారు. కేంద్రం కొనమని చెబుతుంటే..ఇక్కడ బీజేపోళ్లు వరి వేయాలని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు.
దద్దరిల్లిన ధర్నా చౌక్
రైతు మహాధర్నాతో ఇందిరాపార్కు ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ధాన్యం బస్తాలతో రైతులు ధర్నాకు తరలివచ్చారు. వరికంకులను చూపిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మంత్రులు మహమూద్అలీ, తలసానితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్పొరేటర్లు, నాయకులు సంఘీభావం తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో మంత్రులు మల్లారెడ్డి, సబితారెడ్డి పాల్గొన్నారు.
రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోం..
దేశానికి అన్నం పెడుతున్న రైతులను వేధిస్తే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలి చారు. కేంద్రం మాత్రం గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నది. ఇతర రాష్ర్టాల్లో పంట ఉత్పత్తులు కొంటూ తెలంగాణకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నది. కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు రాష్ర్టానికి ఏంచేయకపోయినా ఊరకుక్కల్లా మొరుగుతు న్నారు. బీజేపీ నేతలతో పైసా ప్రయోజనం లేదు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరు కొనసాగుతుంది.
అమర్యాదగా మాట్లాడితే తరిమికొడుతాం..
సోషల్ మీడియా లీడర్లు బండి సంజయ్, అరవింద్లు అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు మాని చేతనైతే కేంద్రంతో ధాన్యం కొంటామని హామీ ఇప్పించాలి. రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ పట్ల అమర్యాదగా మాట్లాడితే తరిమి కొడుతాం. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. బీజేపీకి రైతుల ఉసురు తగలడం ఖాయం.
రైతులంటే ఇంత చిన్నచూపా?
రైతులంటే కేంద్రానికి చిన్నచూపు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల బాగోగులు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నది. డిమాండ్ ఉన్న పంటలే వేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంటే బాధ్యత లేని బీజేపీ నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు. ఇకనైనా రైతులు వాస్తవాలు తెలుసుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి.
రైతన్నకు అండగా నిలబడుతాం..
రైతన్నపై శీతకన్ను వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతులకు బాసటగా నిలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుండటం దురదృష్టకరం. తెలంగాణలో పండుతున్న ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. రైతులు, కార్మికులు, శ్రామికులు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. రైతన్నకు అండగా నిలిచేది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వమే.
ప్రతి గింజను కొనాల్సిందే..
తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. ఉమ్మడి రాష్ట్రం లో రైతన్నలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల బాధలకు చరమగీతం పాడుతూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనకపోతే ఈ ఉద్యమం ఆపేది లేదు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణలో పండే ప్రతి గింజను కొనాలి.
రాష్ట్రం ఆదుకుంటుంటే.. కేంద్రం వంచన
రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతున్నది. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది. రైతులు చక్కటి పంటలు పండిస్తుంటే కేంద్రం మాత్రం అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయకుండా నాటకాలాడుతున్నది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతుంది.
బీజేపీ నేతలు ఢిల్లీలో కొట్లాడాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది. స్వరాష్ట్రంలో మెరుగైన పంటలు పండించే స్థాయికి చేరుకున్న అన్నదాతలకు సాయం చేయాల్సింది పోయి నల్ల చట్టాలతో అవస్థలు కల్పిస్తున్నది. బీజేపీ నేతలకు చేతనైతే రైతుల కోసం గల్లీలో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కొట్లాడాలి.
రెచ్చగొట్టే రాజకీయాలు చెల్లవు..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నది. పండించిన పంటను కొనుగోలు చేయకుండా వేధిస్తున్నది. రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ చేస్తున్న రెచ్చగొట్టే రాజకీయాలను నడవనీయం. రైతుల పక్షాన ప్రతిఒక్కరూ నిలిచి కేంద్రం మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ చివరకు దేశానికి అన్నం పెట్టే అన్నదాతల నడ్డిని మోడీ ప్రభుత్వం విరిచేస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు..
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిగ్గుపడాలి. పూటకో మాట మాట్లాడుతూ.. అన్నీ అబద్ధాలు చెబుతూ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ర్టానికి పైసా పని చేయని బండి నోరు అదుపులో పెట్టుకుంటే మంచింది. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రైతుల పట్ల ఒకలా.. తెలంగాణలోని అన్నదాతల పట్ల మరోలా వ్యవహరించడం సిగ్గుచేటు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనే వరకు ఈ ఉద్యమం ఆగదు. బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటాం.
రాష్ర్టానికి ఒరిగింది శూన్యం..
బీజేపీ ఎంపీలు నలుగురు ఉన్నా రాష్ర్టానికి ఒరగబెట్టింది శూన్యం. తెలంగాణకు ఒక్క రూపాయి తెచ్చింది లేదు. విభజన హామీల ఊసెత్తడం లేదు. గిరిజన యూనివర్సిటీ, ఉ క్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఇస్తామన్న హామీలను గాలికొ దిలేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపె డుతున్న అనేక సంక్షేమ కార్యక్రమా లను చూసి ఓర్వలేని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొ డుతున్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తక్షణమే వడ్లు కొంటామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రధానితో హామీ ఇప్పించాలి. సీఎం కేసీఆర్ భిక్ష మూలంగానే డీఎస్ ఎంపీ అయ్యారు. అరవింద్కు దమ్ముంటే డి. శ్రీనివాస్ ఏ పార్టీలో ఉండో స్పష్టం చేయాలి.
తక్షణమే వడ్లు కొనాలి..
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలను విడనాడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా మారితే ప్రధాన మంత్రి మోడీ అన్యాయం చేయాలని చూస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రతిఒక్కరూ అండగా నిలబడాలి. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వడ్లు కొనేలా చూడాలి. రైతులపై వివక్ష చూపకుండా పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి.
అన్నదాతలను ఆగం చేస్తే అధోగతే..
అన్నదాతలను అధోగతి పాలుచేసిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వడ్లు కొనని బీజేపీ ప్రభుత్వానికి అదే గతి పట్టడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి వారి బతుకులు ఆగం చేస్తున్నది. బీజేపీ నేతలు ద్వంద వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
బీజేపీకి బుద్ధి చెప్పాలి..
అన్నదాతను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడం మానకపోతే తన్ని తరిమేస్తాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రైతు సమితి.
రైతుబంధు తెచ్చిన ఘనత సీఎందే..
రైతు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉద్యమ కాలం నుంచి రైతు సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలితే సహించం.
ఒక్కో రాష్ర్టానికి ఒక్కో న్యాయమా?
పంజాబ్ రైతులకు ఓ న్యాయం. తెలంగాణ రైతులకు మరో న్యాయమా? ఈ ద్వంద వైఖరిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి. తక్షణమే ధాన్యం కొంటామని కేంద్రం ప్రకటన చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే..
రైతుల ఆగ్రహానికి మసై పోతారు..
తెలంగాణ రైతులపై కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్నదాతలు నిరసనలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బాధ్యతలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉండి ఏం లాభం. ఇప్పటికైనా రైతులు బాధలు అర్థం చేసుకొని వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.