హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/ న్యూస్నెట్వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. అత్యధికంగా సికింద్రాబాద్, నిజామాబాద్లలో ఆరుగురు, భువనగిరి, మల్కాజ్గిరి, మహబూబ్నగర్లో ఐదుగురు నామినేషన్లు సమర్పించారు. మహబూబాబాద్, నల్లగొండ, మెదక్లో నలుగురు.. పెద్దపల్లి, జహీరాబాద్, చేవెళ్ల, వరంగల్లో ముగ్గురు.. హైదరాబాద్లో ఇద్దరు.. ఖమ్మం, నాగర్ కర్నూలు, కరీంనగర్, ఆదిలాబాద్లో ఒక్కరు నామినేషన్లు దాఖలు చేశారు.
రెండు రోజుల్లో మొత్తం 98 మంది అభ్యర్థులు 117 సెట్లు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ఖాన్కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. మహబూబ్నగర్ స్థానానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తరఫున ప్రతిపాదకులు టి.శ్రీధర్రెడ్డి, నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నిజామాబాద్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ అదనపు కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ పాటిల్ హేమంత్ కేశవ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.