హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తన సంతకం ఫోర్జరీ చేయడంతోపాటు, ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిశాంక్, ఇతర బీఆర్ఎస్వీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 469, 465, 468, 417, 471, 505 (1) (బీ),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద నల్లగొండ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం క్రిశాంక్ను ఓయూ పోలీసులకు అప్పగించగా, ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఈస్ట్మారేడ్పల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి తరలించేందుకు అన్నీ సిద్ధం చేశారు. కానీ మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో అప్పటి వరకు క్రిశాంక్ను నల్లకుంట పోలీస్స్టేషన్లో ఉంచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిశాంక్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం సాయంత్రం 5.40 గంటలకు అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రిమాండ్ రిపోర్టులో క్రిశాంక్పై 2011 నుంచి నమోదైన దాదాపు 14 కేసులూ బనాయించడం గమనార్హం.
బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికం.
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదు. https://t.co/5vsXsFRMPB— Harish Rao Thanneeru (@BRSHarish) May 2, 2024