వరంగల్, జనవరి 18 (నమస్తేతెలంగాణ): జిల్లాలో 44 కంటి వెలుగు శిబిరాలను గురువారం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. రెండో విడుత కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో ప్రభుత్వం 44 బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వంద రోజులపాటు జిల్లాలో 408 శిబిరాల నిర్వహణతో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు జరిపి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. నిత్యం 44 శిబిరాల్లో 44 బృందాల ద్వారా జిల్లాలో 700 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిబిరాల వద్ద బృందాలకు భోజనం, టెంటు, కుర్చీల ఏర్పాటు ఖర్చు కోసం నిధులు కేటాయించింది. కంటి పరీక్షల నిర్వహణకు ఏఆర్ మిషన్లు, మందులు, టార్చ్లు, కళ్లద్దాలు, ట్యాబ్లను పీహెచ్సీలకు సరఫరా చేసింది. దీంతో గురువారం నుంచి పని దినాల్లో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేత్ర పరీక్షలు చేయనున్నారు.
నేడు ప్రారంభమయ్యే శిబిరాలు
జిల్లాలో గురువారం 44 చోట్ల శిబిరాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. నెక్కొండ మండలం అలంకానిపేట, నెక్కొండ, దీక్షకుంట, నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి, బాంజిపేట, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, జల్లి, దుగ్గొండి మండలంలో కేశవపురం, దుగ్గొండి, గీసుగొండ మండలంలో వంచనగిరి, గీసుగొండ, ఖానాపురం మండలం ధర్మారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి మండలం మేడపల్లి, నల్లబెల్లి, పర్వతగిరి మండలం కొంకపాక, పర్వతగిరి, చింతనెక్కొండ, వర్ధన్నపేట మండలం చెన్నారం, రాయపర్తి మండలం ఊకల్, రాయపర్తి, తిర్మలాయపల్లి, సంగెం మండలంలోని గవిచర్ల, సంగెం, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు, వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు, వరంగల్లో 36, 21, 35, 26, 12 22, 39, 37, 15, 19, 16, 3, 17, 42, 41, 39, 32వ వార్డులో శిబిరాలను ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా కంటివెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు వెల్లడించారు. రాయపర్తి మండలకేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించనున్నారు. నర్సంపేటలో 21వ వార్డుతోపాటు మేడపల్లి, నల్లబెల్లిలో శిబిరాలను ఎమ్మెల్యే పెద్ది ప్రారంభిస్తారు. వర్ధన్నపేట మండలంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గీసుగొండ, సంగెం మండలకేంద్రాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కంటివెలుగు శిబిరాలను ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. 42వ డివిజన్లో ప్రారంభోత్సవంలో మేయర్ గుండు సుధారాణి పాల్గొంటారని చెప్పారు.