న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: బంగారం ధరలు శాంతించాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూడటంతో ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం ఒకేరోజు తులం బంగారం ధర రూ.1,450 తగ్గింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి పుత్తడి ధర రూ.72,200కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ధర రూ.73,650గా ఉన్నది. ఇటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ కలిగిన స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.72,160కి చేరుకున్నది. గతంలో ఇది రూ.73,690గా నమోదైంది. అలాగే రూ.1,400 తగ్గిన 22 క్యారెట్ ధర రూ.66,150కి చేరుకున్నది.
గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ధరలు చేరుకోవడంతో సామాన్యుడు కొనుగోలు చేయడానికి వెనుకంజ వేశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసరంగా ఉన్నవాళ్లు మాత్రమే గోల్డ్ను కొనుగోలు చేశారని, కానీ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు అచితూచి వ్యవహరించారని బులియన్ వర్తకుడు తెలిపారు. చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో బంగారం అమ్మకాలు 15 శాతం నుంచి 30 శాతం వరకు పడిపోయాయని కోల్కతా బులియన్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు తమ పెట్టుబడులు మళ్లించడంతో గత పది రోజుల్లోనే ధర రూ.10 వేలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వెండి వెలవెలపోయింది. కిలో వెండి ఏకంగా రూ.2,300 దిగొచ్చి రూ.85,800 నుంచి రూ.83,500కి దిగొచ్చింది. ఇటు హైదరాబాద్లోనూ కిలో వెండి రూ.2,500 తగ్గి రూ.86,500గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.89 వేలుగా ఉన్నది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒకేరోజు 55 డాలర్లు పడిపోయింది. కోమెక్స్లో స్పాట్ గోల్డ్ ధర 2,310 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. మంగళవారం కూడా ధరలు మరింత తగ్గాయి. మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేకపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీల వైపు మళ్లించడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే కొన్ని రోజుల్లో ఎంసీఎక్స్లో గోల్డ్ ధర రూ.70 వేల మార్క్కు దిగిరావచ్చునని అంచనావేస్తున్నారు.