Bengal Governor | కోల్కతా, మే 5: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్పై లైంగిక ఆరోపణల కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పంపిన సమన్లను పట్టించుకోవద్దంటూ ఆదివారం తమ సిబ్బందిని గవర్నర్ ఆదేశించారు.
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గవర్నర్పై రాజ్భవన్ ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై కోల్కతా పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై దర్యాప్తుకు తమ ముందు హాజరు కావాలంటూ నలుగురు రాజ్భవన్ ఉద్యోగులకు శనివారం సమన్లు జారీ చేశారు. కాగా అధికరణ 361 (2), (3) ప్రకారం రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్పై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు, దర్యాప్తు చేయరాదు. దీనినే గవర్నర్ ‘ఎక్స్’లో పేర్కొంటూ పోలీసు శాఖకు బంధనాలు వేశారు. రాజ్భవన్లో సీసీ టీవీ ఫుటేజ్ను తమకు అందజేయాలంటూ దర్యాప్తు బృందం రాజ్భవన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది.