జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. జమ్మికుంటలో బుధవారం జరిగిన ధూంధాంకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
‘సీఎం సభ ఇక్కడ జరిగితే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయని, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ఆయనను రాకుండా చేసిన్రు.. ఎన్ని రోజులు మీరు ముఖ్యమంత్రిని హుజూరాబాద్కు రాకుండా ఆపగలరు.. గెల్లు గెలిచిన రెండు వారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్కు వచ్చి స్వయంగా ఆయనే మెడికల్ కాలేజీ ప్రకటన చేస్తారు.. అలాగే, హుజూరాబాద్కు వరాల జల్లును కురిపిస్తారు’.. అని మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
నాగార్జునసాగర్లో జానారెడ్డిపై నోముల భగత్ గెలవగానే ఇచ్చిన మాట ప్రకారం నాగార్జునసాగర్కు వెళ్లి అక్కడ అంతకు ముందు ఇచ్చిన హామీలైన నీటి లిఫ్టులు, ఇతర అభివృద్ధి పథకాలను మంజూరు చేసి వచ్చారని గుర్తు చేశారు. జమ్మి కుంట ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారిన రైల్వే బ్రిడ్జిని ప్రజల కోరిక మేరకు తీసేసి, మరొకటి కట్టించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అభివృద్ధిలో దేశంలోనే ప్రథమంగా ఉందంటే, దానికి కారణం కారు గుర్తు, కేసీఆర్ అన్నారు. కాలు అడ్డం పెడితే నీళ్లు పారేలా కాళేశ్వరం కట్టింది కారు గుర్తు కేసీఆర్ అని, రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్, రూ.10 వేల రైతుబంధు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్ అని, అదృష్టం బాగా లేక రైతు చనిపోతే రూ.5 లక్షల రైతు బీమా కల్పించింది కారు గుర్తు కేసీఆర్అని, గొల్లకుర్మలకు గొర్రెలిచ్చింది కారు గుర్తు కేసీఆర్ అన్నారు.
మత్స్య కార్మికులకు ఉచిత చేపలు, వలలు, బైక్లు ఇచ్చింది మా కారు గుర్తు కేసీఆర్ అని, రేపు గీత కార్మికులకు బైక్లు ఇచ్చేది మా కారు గుర్తు కేసీఆర్ అని, మా ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలిచ్చింది కారు గుర్తు కేసీఆర్ అని, ఆడ పిల్లల పెండ్లిండ్లకు కల్యాణలక్ష్మి తెచ్చింది కారు గుర్తు కేసీఆర్ అని, దళితుల దరిద్రం పోయేలా దళితబంధు తెచ్చింది కారు గుర్తు కేసీఆర్ అని.. ఇలా చెప్పుకుంటూ పోతే వంద పథకాలు తెచ్చిన ఘనత కారు గుర్తుకు కేసీఆర్కు దక్కుతుందన్నారు.
‘అసలు పేద ప్రజల కోసం మీరు (బీజేపీ) ఏం చేశారో.. మీకు ఎందుకు ఓటేయ్యాల్నో ఒక్క కారణం చెప్పున్రి.. గ్యాస్ ధరలను రూ.వెయ్యి చేసినందుకా? ఎన్నికలు అయిపోగానే మరో రూ.200 వడ్డించనున్నందుకా? పెట్రోల్, డీజిల ధరలను పెంచి సామన్యుడి నడ్డి విరుస్తున్నందు మీకు ఓటెయ్యాన్లా’..? అని సూటిగా ప్రశ్నించారు. ‘నీకు సూటిగా మాట్లాడే దమ్ములేక.. చాటుకు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నావు’.. అని ఈటలను విమర్శించారు.
‘గ్యాస్ పైన సవాలు విసిరితే ముఖం చాటేశావు.. ధరల పెంపుపై గా కిషన్ రెడ్డిని రమ్మన్నా రాలేదు.. నేను వేసే సవాళ్లను స్వీకరించే దమ్ము లేని మీరు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు’.. అని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘మొన్నటి దాకా వడ్లు కొనరని అసత్య ప్రచారం చేసి, ఇప్పుడు అన్ని ఊళ్లలో కాంటాలు అయితాంటె, మళ్లీ యాసంగిలో వరి వేయొద్దని కొత్త ప్రచారం చేస్తున్నరు.
. ఇయ్యాల జిల్లా కలెక్టర్ ప్రకటన చేసిండు.. యాసంగిలో వరి వేసుకోవచ్చని.. ఇక్కడ విత్తన వరి పెద్ద మొత్తంలో పండుతాంది.. మీరు తప్పని సరిగా వరి పంటను పండించుకోవచ్చు’.. అని హరీశ్రావు హామీ ఇచ్చారు. ‘రూ.లక్ష రుణాన్ని ఉగాది వరకు వడ్డీతో సహా మాఫీ చేస్తాం.. 57ఏండ్లకే ఇక నుంచి పెన్షన్లు రానున్నాయి.. ఈ నియోజకవర్గంలో మహిళల కోసం రూ.25 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.. ఈటల ఎడేండ్లు మంత్రిగా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండి నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే.
గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఇండ్ల జాగలున్న వారందికి సొంత జాగల్నే రూ.5.04 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇల్లును కట్టించి తీరుతా అని అంటున్నాడు’.. అని పునరుద్ఘాటించారు. ‘అంతర్జాతీయ క్రుడాయిల్ ధరల పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధర పెరిగిందని చెబుతున్నారు.. సర్చార్జీలు వసూలు చేసి రూ.3 లక్షల కోట్లు పన్నుల రూపంలో జమ చేసుకున్నది మీరు కాదా’? అని సూటిగా ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ మీద లీటర్కు పన్నుల రూపేణా రూ.38 కేంద్రం ప్రజల నుంచి వసూలు చేస్తున్నదని ఆరోపించారు. ‘ఉజ్వల్ గ్యాస్ పథకంలో ఉచితంగా గ్యాస్ పంపిణి చేస్తున్నమని చెబుతున్నరు.. బీహార్ రాష్ట్రంలో డోలాకుమారి అనే గృహిణికి ఉజ్వల పథకం కింద ప్రధాని గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.. అయితే పెరిగిన గ్యాస్ ధర వల్ల ఆమె గ్యాసును ఆటక మీద పారేసి, తిరిగి కట్టెల పొయ్యినే వాడుతున్నది’.. అని చురకలంటించారు.
నేను లెఫ్టిస్ట్నంటివి .. రైట్ సైడ్ తిరిగితివి.. : మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘నేను మొదటి నుంచి లెఫ్టిస్ట్ను అంటివి.. నా భావాలు వేరు.. నా సిద్ధాంతాలు వేరు అని అంటివి.. తిరిగి గా రాంగ్ సైడ్.. రైట్ బీజేపీలె చేరితివి’ అని ఈటలను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 2009 కంటే ముందు ఇక్కడికి వస్తే మొత్తం ఎడారిగా కనపించేదని, అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు ఈ ప్రాంతమంతా కళకళలాడు తుందన్నారు.
ఈటల ఎందుకు ఇప్పుడు ఉప ఎన్నికలను తెచ్చాడని ప్రశ్నించారు. అందలమెక్కించిన వ్యక్తికే ఈటల వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. ‘ఇక్కడకొస్తే నా ఇంట్ల కులముంటాదే అంటవు.. అక్కడ హైదరాబాద్లో మాత్రం నీకు కోడలు రెడ్డి, అల్లుడు రెడ్డి కావాలె’ అని విమర్శించారు.