జనగామ, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఈ-నామ్లో తక్కువ ధర కోట్ చేశారనే అభియోగంపై ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఐదురోజులుగా మార్కెట్లో ధాన్యం, మక్కలు, అపరాల కొనుగోళ్లను నిలిపివేశారు. అధికారులు పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం తాము తేమ, తాలు, మట్టి ఆధారంగానే ధర నిర్ణయిస్తాం తప్ప ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా మద్దతు ధర ఇవ్వలేమని తెగేసి చెప్పడం.. ఓపిక నశించిన రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా తేమ ఆధారంగా ధరకు అంగీకారం కుదిరింది. దీంతో మంగళవారం ఈ-నామ్ ఆన్లైన్ విధానం ద్వారా ట్రేడర్లు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.
‘సర్కారు వారి పాట క్వింటాలుకు రూ.1700, రూ.1823, రూ.1900 ఏక్ బార్..దో బార్..తీన్ బార్’..ఇదీ చివరికి జనగామ మార్కెట్లో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లలో అన్నదాత శ్రమకు దక్కిన ప్రతిఫలం. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2200 చెల్లించాల్సిన ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి ధర తగ్గించి రైతును దగా చేస్తున్నది. ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు దేవుడెరుగు అసలు ధరకే రూ.500 చిల్లు పడింది. ఎంఎస్పీ క్వింటాకు రూ.2200కు తక్కువకు ఎవరూ కొనద్దు అని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినా అమలు కావడం లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా ధాన్యం రాశుల వద్ద రైతులు ఇంటిల్లిపాది పడిగాపులు కాస్తూ.. రోజూ ఆందోళన చేసిన ఫలితంగా ఎట్టకేలకు ట్రేడర్లు ఆన్లైన్ కొనుగోళ్లు చేశారు. తేమ, తాలు, మట్టి తనిఖీ చేసి ఆన్లైన్లో ధరలను కోట్ చేశారు. కనిష్ఠంగా క్వింటాకు రూ.1700 నుంచి గరిష్ఠంగా రూ.1923, మధ్యస్థంగా రూ.1823 ధర లభించింది. ఈ-నామ్ ట్రేడింగ్లోనూ వ్యాపారులు జట్టుకట్టి ధాన్యం ధరలను నిర్ణయిస్తుంటే నిలువరించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. మరోవైపు కొనుగోలు చేసిన ఉత్పత్తులను లోడ్ చేసి తరలించేందుకు వీలుగా బుధ, గురువారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి బి.నరేంద్ర తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.