Team India | న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొన్నది. మంగళవారం అహ్మదాబాద్లో జాతీయ సెలెక్టర్లు మెగాటోర్నీకి జట్టు ఎంపిక చేయడంపై భేటీ కానున్నారు. అయితే టీమ్ ప్రకటనకు మరో రోజు పట్టే అవకాశమున్నట్లు కనిపిస్తున్నది.
బీసీసీఐ కార్యదర్శి జై షా రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కారణంగా అహ్మదాబాద్ భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రెండో వికెట్కీపర్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంపై సెలెక్షన్ మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో మంచి ఫామ్మీదున్న సంజూ శాంసన్ (385), కేఎల్ రాహుల్ (378) రెండో వికెట్కీపర్ బెర్తు కోసం పోటీపడుతున్నారు.